Saturday, December 22, 2012

26న మోడీ ప్రమాణ స్వీకారం

గుజరాత్‌ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన నరేంద్రమోడీ ఈ నెల 26న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం... కొత్త సభ ఏర్పాటుకు వీలుగా ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాల్సి ఉంటుంది. శుక్రవారం మోడీ రాజ్‌భవన్‌కు వెళ్లి... తన రాజీనామాను, మంత్రివర్గ సభ్యుల రాజీనామా పత్రాలను గవర్నర్‌ కమలా బేణీవాల్‌కు అందించారు. కొత్త అసెంబ్లీ ఫలితాలు వెల్లడయిన గురువారమే ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్‌ రద్దుచేశారు. భాజపా శాసనసభాపక్ష నేతగా మోడీని ఎన్నుకునేందుకు ఈనెల 25న భాజపా ఎమ్మెల్యేలు సమావేశమవుతారు. ఈ సమావేశానికి పరిశీలకుడిగా పార్టీ సీనియర్‌ నేత అరుణ్‌జైట్లీ హాజరవుతారు. ఆ మరుసటి రోజు (26న) మోడీ సీఎంగా ప్రమాణం చేస్తారు.

ఆగ్నేయాసియా నేతలకు అపూర్వ విందు

 ఆగ్నేయాసియా దేశాల కూటమి(ఆసియాన్‌) ఏర్పాటై రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాల నేతలకు ఢిల్లీలోని తాజ్‌ హోటల్‌లో భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అపూర్వ విందును ఇచ్చారు. ఆయన సతీమణి గుర్షన్‌ కౌర్‌ అతిథులను సాదరంగా ఆహ్వానించారు.

త్వరలో భారత్‌ సొంత దిశానిర్దేశ వ్యవస్థ

హైదరాబాద్‌: దిశానిర్దేశ (నావిగేషన్‌) రంగంలో ప్రపంచవ్యాప్తంగా అధునాతన మార్పులు వస్తున్నాయని, జీపీఎస్‌ అవసరాల దృష్ట్యా ఉపగ్రహ దిశానిర్దేశ అనుసంధాన అభివృద్ధి ప్రస్తుతం కీలకంగా మారిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. డీఆర్‌డీవో, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ యూనిట్‌ ఫర్‌ నావిగేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌(ఎన్‌ఈఆర్‌టీయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జరిగిన రెండు రోజుల 'నావిగేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌-2012' ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అమెరికా(జీపీఎస్‌), రష్యా(గ్లోనస్‌), ఈయూ(గెలీలియో), చైనా(కాంపాస్‌) మాదిరిగా భారత్‌ సొంత దిశానిర్దేశ వ్యవస్థ 'ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌' త్వరలో వాస్తవరూపం దాలుస్తుందని తెలిపారు. ఈ రంగంలో పోటీని తట్టుకునేందుకు, భవిష్యత్తు సవాళ్లను ముందుగానే గుర్తించి అధిగమించే కొత్త, ఆధునాతన సాంకేతితకను మనం అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. యూపీఏ 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో శాస్త్ర సాంకేతిక పరిశోధన అభివృద్ధికి రూ.60 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతంతో పోలిస్తే 20% అధికమన్నారు. అయితే పరిశోధనల పరంగా విశ్వవిద్యాలయాల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన పరిశోధనలను కొనసాగించాలని సూచించారు. అంతర్జాతీయ భాగస్వామ్వ కార్యక్రమాల్లో పాల్గొని విదేశాలతో సమానంగా శాస్త్ర, రక్షణ అభివృద్ధికి విద్యాసంస్థలు, జాతీయ ప్రయోగశాలలు కలిసి కృషి చేయాల్సిన అవసరముందన్నారు.

  జపాన్‌లో ప్రతిపక్ష ఎల్డీపీ జయకేతనం!

 ప్రధాని పీఠం అధిష్ఠించనున్న షింజో అబే.

 జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష 'లిబరల్ డెమొక్షికాటిక్ పార్టీ' (ఎల్డీపీ) జయకేతనం ఎగురవేసింది. పార్లమెంట్ దిగువసభలోని మొత్తం 480 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ అత్యధికంగా 294 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార డెమొక్షికాటిక్ పార్టీ కేవలం 57 స్థానాలతో సరిపెట్టుకుని అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఫలితాలకు సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం ఉదయం వెలుడనుంది. మూడేళ్ల వ్యవధిలో ముగ్గురు ప్రధానులు మారడం, అస్తవ్యస్త పరిపాలన కొనసాగించడం, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటివి అధికార పార్టీపట్ల ప్రజల వ్యతిరేకతకు ప్రధాన కారణలయ్యాయి. వీటితోపాటు 2011లో సునామీ భూతం ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం కుప్ప కూలడం కూడా అధికార పార్టీ ఓటమికి దారితీసింది. ఓటమి నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని యోషిహికో నోడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఎల్డీపీ గెలుపుతో ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని షింజో అబే మరోసారి జపాన్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. షింజో మాట్లాడుతూ.. చైనాతో వివాదానికి కేంద్రబిందువైన దీవుల సార్వభౌమాధికారం విషయంలో రాజీపడేదిలేదని హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రజలు తమకు ఊహించినదానికన్నా ఎక్కువ స్థానాలు కట్టబెట్టి బాధ్యత పెంచారని వ్యాఖ్యానించారు.    

చీఫ్ జస్టిస్‌పై అభిశంసనకు శ్రీలంక అప్పీల్ కోర్టు చెక్

శ్రీలంక తొలి మహిళా చీఫ్ జస్టిస్ శిరాని బండారునాయకేకు వ్యతిరేకంగా పార్లమెంటరీ కమిటీ అభిశంసన ప్రక్రియను శుక్రవారం అప్పీల్‌కోర్టు నిలిపివేసింది. పార్లమెంటు స్పీకర్, సెలక్ట్ కమిటీ సభ్యులను జనవరి 3న తన ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు విచారణ ముగిసే వరకు చీఫ్ జస్టిస్ గౌరవానికి భంగం కలిగే చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

No comments:

Post a Comment