Friday, November 2, 2012

బహుజన విముక్తి ప్రదాత జ్యోతీబా గోవిందరావు ఫూలే మరియు అతని సత్యశోధక సమాజ్

జ్యోతీబా గోవిందరావు ఫూలే
వర్ణవ్యవస్థ ఉక్కు పిడికిట నలిగి, అజ్ఞానాంధకారంలో మలిగిపోతున్న బహుజనులను జాగృతం చేసి, సమధర్మాన్ని ఎలుగెత్తి చాటిన బహుజనోద్యమ వైతాళికుడు జ్యోతీబా గోవిందరావు ఫూలే. రాజారామమోహనరాయ్ వంటి సాంఘిక సంస్కర్తల కృషి వర్ణ సామాజిక వ్యవస్థలోని పై అంతస్తులను సంస్కరించడానికి పరిమితమైంది. వర్ణవ్యవస్థలో అట్టడుగున నిలిచిన పునాది వర్గాలను జాగృతం చేసి, వారి బానిస సంకెళ్లను తెంచడానికి జీవితాన్ని అంకితం చేసిన బహుజన సంస్కర్త ఫూలే.

గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా గుర్తింపును పొందిన ఫూలే, మహారాష్ట్రలోని సతారా జిల్లా కత్గున్లో 1827 ఏప్రిల్ 11న  మాలీ కులంలో జన్మించారు. తొమ్మిది నెలల పసిప్రాయంలో ఆయన తల్లిని కోల్పోయాడు. ఫూలే తండ్రి గోవిందు పుణెలో కూరగాయలు అమ్ముకుని జీవిక సాగించేవాడు. శూద్రుడైన ఫూలే చదువుకోవడం ఆ కుటుంబానికే అరిష్టమని అగ్రవర్ణాలవారు భయపెట్టడంతో గోవిందు కొడుకుని చదువు మానిపించేశాడు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న ఫూలేలోని అద్భుత ప్రతిభను చూసి గోవిందు తోటివారు పిల్లవాడిని చదివించమని ప్రోత్సహించారు. అలా 1841లో పుణె స్కాటిష్ మిషనరీ స్కూల్లో ఆయన చదువు తిరిగి కొనసాగింది. జీవితకాల మిత్రుడు సదాశివ బల్లాల్ గోవాండేతో ఫూలేకు అక్కడే పరిచయమైంది. ఛత్రపతి శివాజీ, జార్జి వాషింగ్టన్ల జీవిత చరిత్రలు వారిద్దరికీ స్ఫూర్తి అయ్యాయి. ప్రత్యేకించి థామస్ పైన్ సుప్రసిద్ధ గ్రంథం ‘ది రైట్స్ ఆఫ్ మ్యాన్’ ఫూలేపై ప్రగాఢ ముద్రవేసింది. 1848లో ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లి సందర్భంగా, తక్కువ జాతి వాడివంటూ ఎదురైన అవమానం ఆయన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించింది. మనిషికి, మనిషికి మధ్య గోడలు కట్టే కులం సంఘ జీవితానికి హానికరమని, ఐక్యతకు అవరోధమని, అట్టడుగు వర్గాల వికాసానికి ప్రతిబంధకమని గుర్తించారు. ఇతడు స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మనుస్మృతిని తిరస్కరించాడు. మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. ప్రీస్ట్ క్రాఫ్ట్ ఎక్స్పోస్జ్ అనే గ్రంధాన్ని సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు. 1872లో గులాంగిరి అనే గ్రంధాన్ని ప్రచురించాడు. ఈయన స్థాపించిన సంస్థ - సత్య శోధక్ సమాజ్.


సావిత్రీబాయి
కుల కట్టుబాట్లను, సాంఘిక దురాచారాలను ధిక్కరించి మనుషులందరూ సమానమేనని ఎలుగెత్తి చాటడం ప్రారంభించారు. 1848లోనే శూద్రులు, అతి శూద్రుల కోసం పాఠశాలను ప్రారంభించారు. అగ్రవర్ణేతరులకుచదువులు నిషిద్ధమైన సమాజంలో స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేశారు. 1851లో దేశంలోనే రెండవ ఆడపిల్లల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆయన భార్యే అందులో ఉపాధ్యాయురాలు. చిన్ననాటనే పెళ్లాడిన సావిత్రీబాయి ఆయన కృషికి అడుగడుగునా, చివరికంటా బాసటగా నిలిచారు. ఆమె దేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. యువ వితంతువుల, వారి పిల్లల దైన్యాన్ని చూసి చలించిన ఫూలే 1854లో వారికోసం శరణాలయాన్ని ఏర్పాటు చేశారు. భారత చరిత్రలో బ్రాహ్మణాధిపత్యపు మూలాలను శోధించిన ఫూలే వర్ణాశ్రమ ధర్మాలు బహుజనుల అణచివేత కోసం రూపొందినవేనని గుర్తించారు. అందుకే బ్రాహ్మణ అణచివేత నుంచి దిగువ కులాల విముక్తి లక్ష్యంతో 1873లో ‘సత్యశోధక సమాజం’ స్థాపించారు.

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం
ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఈ కుల వ్యవస్థ భారతీయ సమాజాన్ని అసమ సమాజంగా మార్చివేసింది.నిచ్చెన మెట్లలాగా ఏర్పడిన భారతీయ సమాజంలో బ్రాహ్మణులూ, క్షత్రియులూ పై వరుసలోనూ, శూద్రులూ, అతి శూద్రులూ పంచనములూ కింది వరుసలోనూ చేర్చబడ్డారు. పైవరుసలో వున్న బ్రాహ్మణులూ, క్షత్రియులూ క్రింది వరుసలోకి నెట్టివేయబడ్డ శూద్రులనూ, పంచములనూ శాశ్వతంగా క్రింది వరుసలోనే ఉంచేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలూ తీసుకున్నారు. కులాలను సాక్షాత్తు భగవంతుడే సృష్టించాడనీ, ఏ కులంవాడు యే వృత్తిని చేపట్టాలో కూడా భగవంతుడే నిర్ణయించాడనీ, కుల వృత్తిని చేసుకుని బ్రతకడం, అగ్రవర్ణాల వారికి దాస్యం చేయడం ఆ కులంలో పుట్టిన వాడి ధర్మమనీ బ్రాహ్మణులు క్రింది కులంవాళ్లని నమ్మించారు.
ఇలా అగ్రవర్ణాల వారి కుట్రకు క్రింది వర్గాల వారు వేల సంవత్సరాలుగా బలిపశువులుగా మారారు. అమానుషమైన దోపిడీకీ, అవమానాలకూ గురయ్యారు. శూద్రులకూ, దళితులకూ చదువుకునే అవకాశం లేకుండా చేశారు. విద్యకు దూరం కావడంవల్ల వారు అజ్ఞానాంధకారంలోంచి బయటపడలేకపోయారు. తమకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలనీ అవమానాలనీ గుర్తించలేకపోయారు. పైకులాల వారికి దాస్యం చేయాలని భగవంతుడే నిర్ణయించాడనీ, అది తాము పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితమనీ నమ్మారు. అలా నమ్మడం వల్ల తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న చైతన్యమే వారిలో కలగలేదు.

నిమ్న కులాలవారి కోసం విద్యావ్యాప్తి

నిమ్న కులాలవారి కోసం, స్త్రీల కోసం దేశంలోనే ప్రప్రథమంగా పాఠశాలలు స్థాపించి, విద్యావ్యాప్తి ద్వారా వారిని దాస్య విముక్తుల్ని చేసేందుకు; కులవివక్షనూ, సాంఘిక దోపిడీనీ, మూఢనమ్మకాలనూ ... వాటికి కేంద్ర బిందువైన బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టేందుకు తిరుగుబాటు బావుటాను ఎగురవేసిన తొలితరం సామాజిక విప్లవకారుడు జోతిరావు ఫూలే (1827-1890). నిన్న మొన్నటి వరకూ మన దేశంలో విద్య అగ్రవర్ణాల గుత్తసొత్తుగా వుండేది. స్త్రీలైతే ఏ కులానికి చెందినవారైనా నాలుగు గోడల మధ్య బందీలుగా పడివుండాల్సిందే. విద్య మీదా, రాజ్యం మీదా, మతం మీదా బ్రాహ్మణులదే తిరుగులేని పెత్తనం. ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మం న్యాయం అంటూ వారు బోధించే నీతులన్నీ వారి ఆధిపత్యం కొరకే అన్నట్టు నడిచిన కష్టమైన ఆనాటి కాలంలోనే సమానమైన మరో సమాజం కోసం నడుంబిగించాడు ఫూలే.ఎంతో సాహసోపేతంగా నిమ్న కులాల కోసం, స్త్రీల కోసం పాఠశాలల్ని నెలకొల్పి, వారి కొరకు తన భార్య సావిత్రీబాయికి చదువు చెప్పి ఆమెను టీచర్‌గా తీర్చిదిద్దాడు.అంతేకాక సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, పురోహిత వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించాడు. వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. కార్మిక కర్షకుల హక్కులకోసం, సంఘ సంస్కరణ కోసం దళితులపై తరతరాలుగా సాగుతున్న బ్రాహ్మణీయ దోపిడీని ఎదిరిస్తూ తుదివరకు నిలబడ్డ ఫూలే జీవితం, పోరాటం తదనంతర కాలంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ వంటి ఎందరో మహనీయులకు స్ఫూర్తినిచ్చింది. ఇలా మన హైందవ సమాజంలో తరతరాలుగా శూద్రులకు జరుగుతున్న అన్యాయాలనీ అవమానాలనీ గుర్తించిన మొట్టమొదటి భారతీయ దార్శనికుడు జ్యోతీరావు ఫూలే. 1890 నవంబర్ 28న శాశ్వతంగా విశ్రమించిన ఫూలే భారత సామాజిక విప్లవ పితామహునిగా, బహుజన విముక్తి ఉద్యమపు వేగుచుక్కగా చిరకాలం చరిత్రలో నిలుస్తారు.

"ధీనబందు" పత్రిక స్థాపన

సత్యశోధక సమాజ్‌ స్థాపన సమయంలో పత్రికలన్నీ బ్రాహ్మణులే నడిపేవారు. శూద్రులకు, అతి శూద్రులకు తమ భావ వ్యాప్తికోసం పత్రిక అవసరమని వెంకయ్య అయ్యవారూ, కాలేవార్‌ తదితరులు కలిసి 1200 రూపాయలు వెచ్చించి ఒక ముద్రణా యంత్రాన్ని కొని ‘సత్యశోధక సమాజ్‌’ కోసం బహూకరించారు. 1874 నవంబర్‌లో ఇది జరిగింది. ‘సర్కారు శాఖలోని వ్రాహ్మణుల నుంచి శుద్రాతిశూద్రులకు ఎన్ని కష్టాలు ఎదురవుచున్నావో బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియజేయాలి’ అన్న ఆలోచనతో పత్రిక నడపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ పత్రిక నడిపే శక్తి, ఆర్థిక వనరులు సరిపోవని భావించి పత్రిక స్థాపనను ఫూలే వ్యతిరేకించాడు. అయితే కృష్ణారావు బాలేకర్‌ పట్టుదలతో పత్రికను ‘దీనబంధు’ పేరిట నడిపించారు. అయితే చివరికి ఫూలే ఊహించినట్లుగానే అది ఎక్కువకాలం మనగలగ లేదు.

జ్యోతీబా గోవిందరావు ఫూలే అనుచరులు

1) ముకుందా రావ్ పాటిల్

2) ఛత్రపతి సాహు మహారాజ్ - కొల్హాపూర్ రాజు
  • బ్రాహ్మనేతరులకు ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు
  • దళితులకోసం వసతి గృహాలు పాఠశాలలు
  • కులాంతర వివాహాలు
  • సహపంక్తి భోజనాలు ను అమలుపరచడం
  • అంబేద్కర్ కు ఆర్థిక సహాయం చేసిన రాజు

 గులాంగిరి
భారత దేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు జోతీరావు ఫూలే (1827-1890). దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలించబడాలని ఆయన ప్రగాఢంగా కోరుకున్నారు. ఫూలే ఆలోచనలకూ, విశ్లేషణలకూ ఆయన రాసిన ఈ పుస్తకం అద్దం పడుతుంది. ఈ పుస్తకం రాయడంలో శూద్రులను బ్రాహ్మణులు ఎట్లా మోసం చేశారో చెప్పడం ఒక్కటే ఉద్దేశం కాదు. ఇంతవరకూ బ్రిటీషు ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన ఉన్నత విద్యాబోధనా విధానం ఎంత హానికరమో తెలుసుకొనేలాగ ఆ ప్రభుత్వం కళ్లు తెరిపించడం. తోటి శూద్రుల నిజ పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, బ్రాహ్మణ దాస్యత్వం నుంచి తమని తాము విముక్తి చేసుకోవడం - ఈ రెండూ ఏ కాస్త చదువుకున్న శూద్ర సహూదరులందరి ప్రథమ కర్తవ్యం. ప్రతి గ్రామంలో శూద్రులకు పాఠశాలలు అవశ్యం కావాలి. కానీ అందులో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వుండకూడదు.

దేశం అనే దేహానికి శూద్రులు రక్తనాళాల వంటివారు. అందుచేత ప్రభుత్వం తన ఆర్థిక, రాజకీయ కష్టాలనుంచి గట్టెక్కడానికి ఎప్పుడూ ఆధారపడవలసింది శూద్రుల మీదనే తప్ప బ్రాహ్మణుల మీద కాదు - జోతిరావు ఫూలే.

No comments:

Post a Comment