Sunday, November 11, 2012

ఉద్ధంసింగ్‌

ఉద్ధంసింగ్‌
బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నడిపిన గడ్డ-పంజాబుగడ్డ- ఆ గడ్డ కన్నబిడ్డ ఉద్ధంసింగ్‌. మాతృదేశానికి జరిగిన అకృత్యాలకు, అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలని, ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చి, తన ప్రాణాన్ని తృణంగా అర్పించిన అమరుడు ఉద్ధంసింగ్‌. 1899 డిసెంబరు 26న పంజాబులోని సునామ్‌ గ్రామంలో జన్మించాడు. తండ్రి సర్ధార్‌ తేహార్‌సింగ్‌- రైల్వే వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఉద్ధంసింగ్‌కు తల్లిదండ్రులు పెట్టినపేరు శేర్‌సింగ్‌. అతను రెండు సంవత్సరాల వయసులో వున్నప్పుడు తల్లి మరణించింది. 8 సంవత్సరాల వయసులో వున్నప్పుడు తండ్రి మరణించాడు. శేర్‌సింగ్‌, అతని తమ్ముడు ముఖాసింగ్‌ అనాధలయ్యారు. వారిద్దరినీ భాయి కిషాన్‌సింగ్‌ ఆదుకున్నాడు. అనాధాశ్రమంలో చేర్పించాడు. అమృతసర్‌లో సిక్కుమతం స్వీకరింపచేసి ఉద్ధం సింగ్‌గా పేరుమార్చాడు. ఉద్ధంసింగ్‌ అమృతసర్‌ లోని అనాధాశ్రమంలో వుంటూ విద్యాభ్యాసం చేశాడు.

1919లో ఏప్రిల్‌ 13-భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో రక్తసిక్తమైన రోజు. అమృత్‌సర్‌ లోని జలియన్‌వాలాబాగ్‌ మారణ హోమం జరిగిన రోజు.  క్రూరుడు డయ్యర్‌ కిరాతకానికి వందలాదిమంది స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు ప్రాణాలు విడిచిన రోజు. బ్రిటీష్‌ పాలకు లు ప్రవేశపెట్టిన రౌలట్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాఉద్యమ నాయకులు డా సైపుద్దీన్‌ కిచ్లూ, డా సత్యపాల్‌ అక్రమ అరెస్టులను నిరసిస్తూ, జలియన్‌ వాలాబాగ్‌ సభ జరిగింది. సభకు వేలాదిగా తరలి వచ్చారు. ప్రశాంతంగా సభ జరుగుతున్నది. అది వేసవి కాలం. సభకు వచ్చిన వారికి మంచినీళ్ళు అందజేయాలని అనాధాశ్రమం విద్యార్థులు అక్కడికి చేరారు. దానికి ఉద్ధంసింగ్‌ నాయకుడు. అకస్మాత్తుగా జనరల్‌ డయ్యర్‌ నాయకత్వంలో మిలటరీ జలియన్‌వాలాబాగ్‌ను చుట్టుముట్టింది. తూటాల వర్షం కురిసింది. వందలాదిమంది నేలకు వొరిగారు. వందలాదిమంది క్షతగాత్రులయ్యారు. జలియన్‌వాలాబాగ్‌ రక్తసిక్తమయింది. ఉద్ధం సింగ్‌ గాయాలతో, ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఆ భయంకర దృశ్యం అతని కళ్ళముందు కదులుతూనే వుంది. ప్రజల హహకారాలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి. పక్కనే వున్న సిక్కుల దేవాలయం గురుద్వారా గోల్డెన్‌ టెంపుల్‌కు చేరాడు. పవిత్ర సరోవర్‌ పక్కన రక్తపు మరకలు కడిగేసి, స్నానం చేశాడు. మారణహోమానికి కారకులైన జనరల్‌ డయ్యర్‌, పంజాబు గవర్నర్‌ మిఖైల్‌ ఓ డయ్యర్‌ ప్రాణం తీసి, ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు..

జనరల్‌ డయ్యర్‌
విద్యకు స్వస్తి చెప్పి, అనాధాశ్రమం వీడి, మిత్రుల సహాయంతో అమెరికా చేరాడు. అక్కడ గదర్‌పార్టీతో సంబంధాలు నెలకొల్పుకున్నాడు. విప్లవాల గురించి తెలుసుకున్నాడు. 1927లో భగత్‌సింగ్‌ కోరిక మేరకు రహస్యంగా భారతదేశం తిరిగొచ్చాడు. అతనితోపాటు 25 మంది విప్లవకారులొచ్చారు. పంజాబులో విప్లవ కార్యక్రమాలు ప్రారంభించాడు. కొద్ది రోజులకే మారణాయుధాలు, మందుగుండు, ''గదర్‌'' ''బోల్షివిక్‌'' విప్లవసాహిత్యంతో పాటు పట్టుబడ్డాడు. 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది.
ఉద్ధంసింగ్‌ జైల్లో వున్నప్పుడే భగత్‌సింగ్‌ ఉరి కంబమెక్కాడు. అది ఉద్ధంసింగ్‌కు మరింత ఆవేదన, ఆవేశానికి గురిచేసింది. 1931 అక్టోబరు 23న జైలునుండి విడుదలయ్యాడు. కొంతకాలం స్వగ్రామం సుమాన్‌లో ప్రశాంతంగా వుండాలను కున్నాడు. కానీ పోలీసుల వేధింపులు అధిక మయ్యాయి. 1933లో రహస్యంగా దేశం నుండి బయటపడ్డాడు. శేర్‌సింగ్‌, ఉద్ధంసింగ్‌, ఉధాంసింగ్‌, ఉడేసింగ్‌, ఉదరుసింగ్‌, వేరువేరు పేర్లతో జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్విటర్లాండ్‌ మొదలైన దేశాలు తిరిగాడు.1934 నాటికి లండన్‌ చేరాడు. లండన్‌లోని ఇండియా హౌస్‌రూల్‌ సొసైటీతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. జలియన్‌వాలాబాగ్‌ మారణహోమం, జనరల్‌ డయ్యర్‌-మిఖైల్‌ ఓ డయ్యర్‌, అతని మనసులో మెదలుతూనే వున్నారు. చేసిన ప్రతిజ్ఞ, ఆ దుర్మార్గులను వేటాడే పనిచేస్తూనే, ఇంజనీరింగ్‌ విద్య పూర్తిచేశాడు.


జనరల్‌ డయ్యర్‌ అనారోగ్యంతో 1927లో లండన్‌లో మరణించాడు. ఇక మిగిలింది మైఖైల్‌ ఓ డయ్యర్‌ మాత్రమే. 1940 మార్చి 13వ తేదీ లండన్‌లోని కాష్కలన్‌ హాలులో రాయల్‌ సెంట్రల్‌ ఏషియన్‌ సొసైటీ, ఈస్టిండియా అసోసియేషన్‌ సభ జరుగుతుందని- ఆ సభలో మిఖైల్‌ ఓ డయ్యర్‌ ప్రసంగించబోతున్నాడని తెలిసింది. ఇన్ని సంవత్సరా లుగా వీక్షిస్తున్న సమయం వచ్చినందుకు సంతో షించాడు ఉద్ధంసింగ్‌. యాధృచ్చికంగా-జలియన్‌వాలాబాగ్‌ మారణ హోమం జరిగిన 13వతేదీ-ఉద్ధంసింగ్‌- సభలో జనం మధ్య కూర్చున్నాడు. సాయంత్రం 4.30 గంటల సమయం. సభ ముగిసింది. సభాధ్యక్షులు లార్డ్‌ జెట్‌లాంగ్‌, మిఖైల్‌ ఓ డయ్యర్‌ వేదికపై నుండి లేచారు. ఉద్ధంసింగ్‌ జేబులో నుండి పిస్తోలు తీశాడు. లేచి డయ్యర్‌కు గురిపెట్టాడు. అతను నేలకూలాడు. మరోదెబ్బకు జెట్‌లాంగ్‌ పడిపోయాడు. ''భారత మాతకీ జై'' అంటూ నినదిస్తూ ఉద్ధంసింగ్‌ నిలిచాడు.

పోలీసులు బంధించి-లాకప్‌లో చిత్ర హింసలు పెట్టారు. బాధను భరిస్తూ-ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు గర్వపడుతూ పోలీసులను అడిగాడు. ఇంతకు లార్డ్‌ జెట్‌లాంగ్‌ కూడా చచ్చాడా? లేదా? అతను చచ్చేఉంటాడు. ఎందుకంటే అతని పొట్టలో తూటాలు దూర్చాను '' అన్నాడు. ఏప్రిల్‌1, 1940న-ఉద్దంసింగ్‌ను లండన్‌లోని సెంట్రల్‌ క్రిమినల్‌ కోర్టుముందు నిలిపారు.

జడ్జి అట్కిన్‌సన్‌

''నీ పేరేమిటి? ''ఉద్దంసింగేనా?'' అడిగాడు

కాదు... నాపేరు రాం-, మహమ్మద్‌-సింగ్‌- ఆజాద్‌'' అన్నాడు. తాను చేసింది న్యాయసమ్మత మైనది. ఉద్దేశపూర్వకంగానే చేశానన్నాడు.

మైఖైల్‌ ఓ డయ్యర్‌
''అతనంటే నాకు ద్వేషం, అందుకే కాల్చి చంపాను. దీనికి అతను అర్హుడు. అతను ద్రోహి, నేరస్తుడు. అతను మా భావాలను అణచాలని చూశాడు. మా ప్రాణాలు తీశాడు. అందుకే అతన్ని హతమార్చాను. 21 సంవత్సరాలుగా ఈ ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రయత్నించాను. నాకు సంతోషంగా వుంది. ఈనాటికి అది నెరవేరింది. నేను చావడానికి భయపడను. నా మాతృదేశం కోసం మరణిస్తాను. నా దేశ ప్రజలు, బ్రిటీష్‌ పాలనలో ఆకలితో అలమటించడం చూశాను. దానికి నిరసనే నా చర్య. ఇది నా బాధ్యత- కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎంత శిక్ష విధించినా 10-20 లేదా 50 సంవత్సరాలు- లేక ఉరిశిక్ష విధించినా నా దేశం కోసం ప్రాణం యివ్వడానికి సిద్ధంగావున్నాను. నా మాతృదేశం కోసం ప్రాణమర్పించే గౌరవం దక్కితే- గర్వపడతాను? అన్నాడు.

జూన్‌ 4, 1940 నాడు జడ్జి అట్కిన్‌సన్‌ ఉరిశిక్ష విధించాడు. జూలై 31, 1940 నాడు లండన్‌లోని పెంటాన్‌విల్లే జైల్లో ఉరికంభంపై ఉద్దంసింగ్‌ వొరిగిపోయాడు.

అతని శవాన్ని జైలు ఆవరణలోనే పూడ్చి పెట్టారు. ఉద్దంసింగ్‌ మరణవార్త-అతని దేశభక్తి, ధైర్యసాహసాలు కొనియాడుతూ ''లండన్‌ టైమ్స్‌'' రోమ్‌లోని''బెర్గెరెట్‌'' జర్మనీలోని ''బెర్లినర్‌ బోర్సెక్‌ సైటింగ్‌'' పత్రికలు ప్రశంసించాయి. కానీ, భారత జాతీయోద్యమ నేతలు మహాత్మాగాంధీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలైనవారు ఉద్దంసింగ్‌ చర్యను ఖండించారు. మిఖైల్‌ డయ్యర్‌ హత్య సమర్ధనీయం కాదన్నారు. కానీ, భారత ప్రజలు ఉద్దంసింగ్‌ దేశభక్తిని, త్యాగనిరతిని కొనియాడారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో భారత ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకుని-

''షహీద్‌-ఎ-ఆజం ఉద్దంసింగ్‌కు నా సాల్యూట్‌'' అన్నారు. 1974లో పంజాబు సుల్తాన్‌పూర్‌ శాసనసభ్యుడు సాధూసింగ్‌ తీర్దు ఉద్దంసింగ్‌ వీరగాథను ప్రభుత్వ దృష్టికి తెచ్చాడు. ఇందిరాగాంధీ దానికి స్పందించారు. ఇంగ్లండు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి-ఉద్దంసింగ్‌ అస్థికలను భారతదేశానికి తీసుకొచ్చారు. ఉద్దంసింగ్‌ మరణించిన 34 సంవత్సరాల తర్వాత అస్థికలను, అతను స్వగ్రామం సునామ్‌పూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కొన్ని ఆస్థికలు గంగానదిలో కలిపారు. ఉద్దంసింగ్‌ వీరగాథ-అజరామరమైనది.

వీరుడు-అమరుడు-అజేయుడు-ఉద్దంసింగ్‌- వీరగాథలు నేటికీ పంజాబు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

No comments:

Post a Comment