Sunday, April 28, 2013

వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులు 63,621

* ప్రధాన కార్యదర్శికి ప్రభుత్వ శాఖల నివేదిక
* ఆర్థిక శాఖ జాబితా రూపొందించాక భర్తీ ప్రక్రియ

హైదరాబాద్: ప్రభుత్వానికి ఇప్పటి వరకూ అందిన వివరాల ప్రకారం వివిధ శాఖల్లో 63,621 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో 20,790, పోలీసు శాఖలో 10,730 ఖాళీలతో పాటు పలు ఇతర శాఖల్లోని వివరాలను ఏప్రిల్ 27న ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూకి ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. ఇంకా పలు శాఖల్లో ఖాళీల వివరాలు అందలేదు. వాటిని రెండు రోజుల్లో సమర్పించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యోగాల ఖాళీల వివరాల సేకరణకు ప్రధాన కార్యదర్శి ఏప్రిల్ 27న సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్థిక శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా నివేదికలు ఇచ్చారు. అన్ని శాఖల నుంచి నివేదికలు అందాక వాటిని ఆర్థిక శాఖకు పంపిస్తామని, అక్కడ దస్త్రం రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదం తీసుకొని భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రధాన కార్యదర్శి చెప్పారు. గతంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

ఖాళీల వివరాలు

పాఠశాల విద్యాశాఖ - 20,790; పోలీసు శాఖ - 10,730; రెవెన్యూ (భూపరిపాలన ప్రధాన కమిషనర్) - 6,095; ఇంటర్మీడియట్ విద్య - 2,898; ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు - 3,208; కుటుంబ సంక్షేమం - 2,234; ఏపీ జెన్‌కో - 1,303; వైద్యవిధాన పరిషత్ - 974; వైద్య విద్య - 963; అగ్నిమాపక శాఖ - 886; ఆయుష్ - 729; కళాశాల విద్యాశాఖ - 685; గురుకుల విద్యా సంస్థలు - 684; అటవీ శాఖ - 600; ఉపాధి కల్పన - 577; వాణిజ్య పన్నుల శాఖ - 573; ట్రెజరీ - 407; జైళ్ల శాఖ - 383; ఎక్సైజ్ - 364; సర్వే - 342; పశుసంవర్థకం - 290; టౌన్‌ప్లానింగ్ - 288; సాంకేతిక విద్య - 286; నీటిపారుదల - 277; వ్యవసాయం - 236; ప్రజారోగ్యం - 225; పౌరసరఫరాలు - 223; రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ - 194; ప్రత్యేక భద్రత దళం (ఎస్పీఎఫ్) - 185; దేవాదాయ శాఖ - 180; ఉద్యానవన విశ్వవిద్యాలయం - 167; ఆప్కో - 162; రోడ్లు భవనాల శాఖ - 135; బీమా సంచాలకుల కార్యాలయం - 113; సాధారణ పరిపాలన శాఖ - 104; ఆర్థిక శాఖ - 103. ఇవి కాకుండా మరికొన్ని శాఖల్లో వంద కంటే తక్కువ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది.

Friday, April 26, 2013

తుద'కీ' తప్పులే గురువా!

 హైదరాబాద్‌: కొంతమంది ఆచార్యుల్లో ఎంత'కీ' మార్పు రావడం లేదు. ఏపీపీఎస్సీ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ఫారెస్టు రేంజి అధికారి (ఏఎఫ్‌ఆర్‌ఓ) ఉద్యోగాల ప్రశ్నపత్రాల తుది 'కీ' ఖరారులో ఆచార్యులు మరోమారు తమ బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో మళ్లీ సవరణలతో మరోమారు తుది' కీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. తుది 'కీ' ప్రకటించిన తరువాత ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు సబ్జెక్టుల్లోని 20 ప్రశ్నల జవాబుల్లో మార్పులు జరగడం గమనార్హం. ఉద్యోగ నియామకాల్లో ఒక మార్కు కూడా కీలకమే. ఇప్పుడు ఆచార్యుల తీరు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. వీరి భవిష్యత్తే అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఏర్పడింది. వీరి వల్ల ఏపీపీఎస్సీ అధికారులూ తలలు పట్టుకుంటున్నారు. ఏఎఫ్‌ఆర్‌ఓ ఉద్యోగాల భర్తీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వీటి భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో వివిధ సబ్జెక్టుల వారీగా అతికష్టంమీద ప్రాథమిక 'కీ' జారీ చేస్తే, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వీటిని పరిశీలించడం ఏపీపీఎస్సీకి కత్తిమీద సామే అయింది.